4.17.2016

అప్పటి బ్లాగర్లు.. బ్లాగులు

వనజా!

బ్లాగుల్లో లేఖా సాహిత్యం వినడానికి ఎంత బాగుందో.. బాధ్యతల్లోనో బంధాల సందడిలో మనసు అలసినప్పుడు నేస్తానికి చెప్పుకోడానికంటూ ఒక చిన్న సదుపాయం,  మన చిన్నతనంలో అయితే ఉత్తరాలు రాసుకునేవాళ్ళం ఆరోజులు ఎంత మధురమయినవి ఎఱ్ఱటి ఎండలో పోస్ట్‌మెన్ కోసం ఎదురుచూడడం ఒక గొప్ప అనుభూతి. మన దగ్గరే ఉన్న స్నేహితులతో కబుర్లు ఒక ఎత్తయితే, మన ఎదురుగా లేని బంధువుల ఉత్తరాల సమాచారం మరొక అనుభూతి . ఇప్పుడేది ఆ ఆతృత, ఆ మాటల సందడి.. మాటలంటే గుర్తొచ్చింది వనజా అసలు మాట్లాడుకోడానికి మనుషులేరి? మనసేది? ఏ బంధమయినా ఏ అనుబంధమయినా సెల్్ఫోన్ల బిజీ తో, సెల్ఫీల సంబరాలతోనో గడిపేస్తున్నాము. టెక్నాలజీకి బానిసలమయిపోయాము. ఎదురుగుండా మనిషి మనతో మాట్లాడకపోయినా సహిస్తాము కాని ఎక్కడో ఉన్న మనిషి మనకి ఈరోజు ఫోన్ చేయలేదని సెల్ ఫోన్ వంక చూస్తూ ఆరాటపడిపోతూ ఉంటాము. మాటలకి విలువ అలాగే ఉంటుంది.. మనసు కి మటుకు ఒక మనసుని తోడు ఇవ్వలేకపోతున్నాము కదా వనజా. అసలు మనమంతా ఒంటరిగా ఉన్నమెమో అని కదా అప్పట్లో ఈ బ్లాగులన్నవి వచ్చి మనకి కాస్త ఊరటని ఇచ్చాయి. బ్లాగులంటే గుర్తొచ్చింది.. నెనేలాగు మీ అందరికన్న సీనియర్ కాబట్టి నా బ్లాగ్ అనుభవాలు మీతో పంచుకుంటాను. 

బ్లాగుల మొదటి రోజుల్లో ఈనాడు ఆదివారం పేపర్లో బ్లాగుల గురించి చెప్పినప్పుడు ఒకసారి అలా ప్రయత్నించాను. ఒక నాలుగు లైన్ల  ఒక టపా.. ఆతరువాత ఇంకోటి అలా ఒక్కొక్కటి రాస్తూ రాస్తూ ఒక బ్లాగర్ అనిపించుకున్నాను. 

నేను  బ్లాగర్ లక్ష్మి గారు
ఈ టి వి సఖీ షూటింగ్ సమయంలో బ్లాగర్లతో 














ఇక బ్లాగ్ స్నేహితుల గురించిచెప్పాలంటే అప్పట్లో అందరూ మంచి రచయిత్రులు, రచయితలు కేవలం నాలుగు లైన్స్ రాసి మేము గొప్పవాళ్ళం అని ఎవరు అనుకోలేదు. తెలుగు అన్నా తెలుగు సాహిత్యమన్నా  మక్కువ చూపే వారిలో ఆద్యులు కొత్తపాళీ గారు, రానారే గారు, నువ్వుశెట్టి బ్రదర్స్,  సుజాత బెడదకోట, సుజాత మణిపాత్రుని, శశికళ, విరించి, రెండు రెళ్ళు ఆరు తోట రాముడు, భరద్వాజ్ వెలమకన్ని, పప్పు శ్రీనివాస్ , కార్తిక్ ఇంద్రకంటి, కల్పనా రెంటాల, మహేష్ కత్తి, అరుణ పప్పు, వీవెన్, నాగార్జున చారి, సౌమ్య అలమూరు, సౌమ్య, పూర్ణిమ తమ్మిరెడ్డి, మంచు.. ప్రసాద్ చరశాల, చదువరి, వరూధిని కాట్రగడ్డ, మలాకుమార్, జ్యోతివలభోజు, ప్రవీణ్ (మార్తాండ), శ్రీనివస్ ధాట్ల , కిరణ్ కుమార్ చావా, నిడదవోలు మాలతి, కస్తూరి మురళి కృష్ణ, రవి రవి, లక్ష్మి, శ్రీధర్ నల్లమోతు, బులుసు సుబ్రహ్మణ్యం (అందరికి చివర గారు ఉంది చదువుకోవాలి) ఇలా ఎంతమందో నిజానికి మేమంతా ఒక కుటుంబంలా ప్రతీ డిసెంబర్ 2 వ తేదిన బ్లాగర్ల రోజుగా జరుపుకుంటూ డిసెంబర్లో జరిగే పుస్తక ప్రదర్శనశాల లో కలుస్తూ సందడిగా గడిపేవాళ్ళం.


భరద్వాజ్ వెలమకన్ని గారు, తోట రాముడు, బులుసు సుబ్రహ్మణ్యం గారు నేను

మళ్ళీ ఆరోజులు  రావాలని వనజా మీరు చేపట్టిన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నట్లు మీకో విషయం తెలుసా బ్లాగు బంధాలు కొనసాగుతున్నాయి అని తెలియచెప్పడానికి బ్లాగు ద్వారా  పరిచయమయిన తమ్ముడు భరధ్వాజని రెండు రోజుల క్రితమే కలిసాను. తమ్ముడితో పాటుగా బులుసు సుబ్రహ్మణ్యం గారిని, రెండు రెళ్ళు ఆరు బ్లాగర్ తోట రాముడి గారిని కలిసి ఆ పాత మధురాలని తలుచుకుంటూ చాలా సందడిగా గడిపాము..  మీకు తెలుసు కదా భరద్వాజ్ వెలమకన్ని ఎన్నారై ... తమ్ముడి మరో పేరు మలక్‌పేట రౌడి, మలకానంద స్వామి.. వీటి గురించి మరో సారి ప్రస్తావిస్తాను.

వనజా మనం మళ్ళీ ఆరోజులని తీసుకురావాలి అంత సందడిగా గడపాలి.. రండి అందరం కలుద్దాము వారానికి ఒక టపా రాద్దాము మన ఊసులు మన కబుర్లు మన అభిప్రాయాలు.. మనం మనంగా మనసున్న నేస్తాలుగా మనసులకి ఊరటనిద్దాము.  
అప్పటి బ్లాగర్లందరు సుజాత గారింట్లో నిడదవోలు మాలతి గారిని కలిసిన శుభ సందర్భం

నన్ను మీ అందరికీ పరిచయం చేసే నేపధ్యంలో బ్లాగర్లందరిని ఒకసారి అలా గుర్తు చేసుకున్నాను అందుకు మీకే కృతజ్ఞతలు వనజా.. మంచి ఆలోచన మంచి స్నేహితులు.. ఉంటే బ్లాగులు బ్లాగర్లు ఏ సోషల్ మీడియా అయినా తులసి వనం .. అని నా అభిప్రాయం.

****** 
Loading...