11.26.2017

వనభోజనం-మనభోజనం 7, తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి గారు

వ్యక్తిత్వం అంటే " బ్రాండెడ్" దుస్తులు వేసుకుంటేనో... పెట్టుపోతల్లో " బ్రాండెడ్" దుస్తులు పెట్టించుకుంటేనే రాదు... !!!   

అంటూ   ఎంతోమందికి ఆదర్శప్రాయంగా మనం వెస్ట్ అనుకునే వస్తువులతో ఉపయోగపడే వస్తువులు చేస్తూ మూర్తిభవించిన వ్యక్తిత్వం గల వ్యక్తీ తరిగొప్పుల విఎల్లెన్ మూర్తిగారు. రామలక్ష్మి,,సదానంద రావుగారి దంపతులకి మార్చ్ 31 మండుటెండలో జన్మించిన మూర్తిగారు Star Maa లో ఉద్యోగం చేస్తున్నారు. 1992 లో భక్తీ సుమమాల  తోలిప్రచురణ కాగా  పునరపి జననం హైకూ కవితల సంపుటి మలి ప్రచురణ. అలాగే ఆంధ్రజ్యోతి, స్వాతి పత్రికలలో పలు కథలు ప్రచురించ బడ్డాయి.


కథలు, కవితలు, హైకులతో పాటుగా  బ్యాటరీ మోటారుతో   ప్లాస్టిక్ కారు బొమ్మలు తయారు చేయడం మూర్తిగారి ప్రత్యేకత.

హాస్య ఛతురోక్తులు ,హాస్య చిత్రాలతో కామెంట్స్ మరో ప్రత్యేకత.

వనభోజనాలకి వచ్చి తాను బాటరీ మోటారుతో తాయారు చేసిన బొమ్మని పిల్లలికి చూపిస్తూ అందరికి  అభిమాన పాత్రులయ్యారు మూర్తిగారు.  మూర్తిగారు చెంత ఉంటే స్ఫూర్తి నిజంగా మన వెంటే...

మూర్తిగారు వనభోజనాలకు మీలాంటి మూర్తిభవించిన స్ఫూర్తి   కలిగిన వ్యక్తులు రావడం నిజంగా మా    అదృష్టం.  మీకు మా   ధన్యవాదములు.

ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి వారు చేసిన బొమ్మలు కనిపిస్తాయి.

వనభోజనాల్లో ప్రదర్శించిన అద్భుత బ్యాటరీ ప్రయోగం ఇది
తనకు కావాల్సినవి శివుడే చేయించుకుంటాడు... సంకల్పం సగం బలం.... సంతోషం మిగతా సగం..

చీకట్లోకి వెలుగు వచ్చినంత ఆనందం!!!

11.23.2017

వనభోజనం-మనభోజనం 6. పవర్ కోటేశ్వర రావు గారు



నిజానికి పవర్ కోటేశ్వర రావు గారు వనభోజనాల ముందురోజు రాత్రి వరకు నాకు తెలీదు. మెడం నా తరుపునుండి 10 దాకా వస్తారు అంటే ఎవరబ్బా అనుకున్నా... వనభోజనాలలో కనిపించినప్పుడు అదే అడిగాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానా మీరు  అని అడిగా పేరు మూడు పవర్ చూసి.  కాదు, నేను విధ్యుత్ శాఖలో పని చేసాను అని తన ఉద్యోగ విషయాలు తెలిపారు పవర్ కోటేశ్వర రావు గారు. 


వీరు  Deputy Executive Engineer, Greater Hyderabad Municipal Corporation. లో చేస్తున్నారు.             సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడి ఆ వీడియోలను అందరికి ఉపయోగ  పడేలా తన ఫేస్ బుక్ లో   షేర్ చేసి     సమయానికి తగ్గట్లుగా ఉన్న వనరులని, సంస్కృతిని , సంప్రదాయాలని సంరక్షించుకోవాలని చెప్తూ ఉంటారు.. వారి వీడియోలని మీరు ఒకసారి చూడండి నేను ఏమి చెప్పనవసరం లేదు. 


మన వనభోజనాలకి మిత్రుల సమేతంగా వచ్చి ఉన్నది   కాసేపయినా మన సంస్కృతీ , సంప్రదాయాల గురించి మంచి సందేశం  ఇచ్చారు   పవర్ కోటేశ్వర రావు గారు. 







ఇలా ఎన్నెన్నో లైవ్ వీడియోస్. తానూ సామాజిక సేవా   కార్యక్రమాలని చేస్తూ మిగతావారిని చేయమని ప్రోత్సహిస్తూ పవర్ కోటేశ్వర రావు గారు పవర్ ఫుల్ మెసేజెస్ ఇస్తూ యువతని ఉత్తేజ పరుస్తున్నారు. మేమెవరో తెలియకపోయినా వనభోజనాలకి వచ్చి మంచి సందేశం ఇచ్చిన కోటేశ్వర రావు గారికి ధన్యవాదములు. 

పవర్ కోటేశ్వర రావు గారి ఫేస్ బుక్ లింక్.. పవర్ కోటేశ్వర రావు గారు


పైన ఉన్న పేర్ల మీద క్లిక్ చేస్తే మీరు వారి వీడియోలు కనిపిస్తాయి, వారి సందేశాలు వినిపిస్తాయి. 

11.21.2017

వనభోజనం-మనభోజనం 5. ఇలపకుర్తి రాధాదేవి గారు



అనర్గళంగా మాట్లాడుతూ, ఆశువుగా అమ్మవారి పాటలను తన గొంతులో పలికించగల అమ్మగారు శ్రీమతి ఇలపకుర్తి రాదాదేవిగారు. మనకి సుపరిచితురాలు కాఫీ విత్ కామేశ్వరి గారి అమ్మగారు. సరస్వతీ  కటాక్షం అమ్మగారి  వర్చస్సులో గోచరిస్తూ ఉంటుంది. పాట పాడుతున్నప్పుడు అమ్మవారు అక్కడ ఆసీనులై రాగమాలపిస్తున్నారా అన్నంత సుందరంగా ఉంటుంది ఆ గాన మాధుర్యం. తానూ రాలేకపోయినా వీల్ చైర్ లో వనభోజనాలకి వచ్చి కార్తీకమాస వనభోజనాలకి తన భక్తిరస గానమాధ్యుర్యంతో ఒక హుందాతనాన్ని తీసుకువచ్చిన అమ్మ శ్రీమతి ఇలాపకుర్తి రాధాదేవి గారు.. ఆవిడ తన స్వీయ గీతాలని ఎలా ఆలపిస్తారు ఏవిధంగా తాను పాడగలను అన్న విషయాన్ని కూడా అక్కడ అందరికి విడమర్చి చెప్పారు. అంతా అమ్మవారి కటాక్షం నాదేమి లేదు అంటారు అమ్మ. అంతే కాదు వనభోజనాలని కూడా ఏంతో ప్రశంసించారు. సుందరకాండ ఆలపిస్తూ ....... వనభోజనాలు చాలా చూసాను ఇవే అసలయిన వనభోజనాలు అని ఆమె నుండి రావడం మనందరికీ దీవెనలవంటివి. అమ్మగారికి సదా పాదాభివందనంలతో ఇదిగో మీరు వినండి ఆ గాన మాధుర్యం.  




ఆవిడే కాదు శ్రీమతి ఇలాపకుర్తి రాధాదేవి గారి కుటుంబం వారి పెద్దమ్మాయి మన కాఫీ విత్ కామేశ్వరి, కామేశ్వరి గారి చెల్లెలు శ్రీమతి పద్మజ గారు, కామేశ్వరి కోడలు శ్రీమతి వాణి గారు, వాణి గారి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు, కామేశ్వరిగారి స్నేహితురాలు శ్రీమతి ఉమాదేవి కల్వకోట గారు ఈ వనభోజనాలకి వచ్చిన ప్రముఖులలో ముఖ్యులు.



11.17.2017

వనభోజనం-మన భోజనం 4. ఎస్సార్ కట్టా గారు





వనభోజనాలకి పిలవగానే వచ్చిన ఆజానభాహులు అమ్మో తల ఎంత పైకేత్తినా ఇంకాస్త తల ఎత్తితే కాని కనపడరేమో అన్నంత పొడుగు ఎస్సార్ కట్టాగారు. అసలెలా మాట్లాడతారో వినాలనుంది. ఒక చిరునవ్వు, తప్పితే మాట్లాడింది చాలా తక్కువ , నెమ్మదితనం, అందరిని గమనిస్తూ చివరిదాకా ఉండి చివరిలో బై అని చెప్పిన ఆ సింప్లిసిటీ , మీగురించి నాకేమి తెలియదండి మిమ్మల్ని కవిసంగమం గ్రూప్ లో చూసాను కాస్త చెప్పరూ! అని అడగగానే తన గురించి క్లుప్తంగా ఇలా చెప్పారు శ్రీ ఎస్సార్ కట్టాగారు.... ఆయనే కాదు తన గురించి కూడా తలెత్తుకునేలా "ఓ మంచి స్నేహితుడు"  అన్నట్లుగా చెప్పిన ఆ తీరు చూడండి/చదవండి. 



ఎస్సార్ కట్టా గారు.. చాలా చాలా థాంక్స్ మీరు వచ్చినందుకు. 

***** 


పేరు కట్టా సుదర్శన రెడ్డి. తండ్రి కీ.శే. కట్టా రామచంద్రారెడ్డి గారు. తల్లి వజ్రమ్మ గారు. స్వస్థలం ఛాయా సోమేశ్వరాలయంతో ప్రసిద్ధిగాంచిన పానగల్లు స్వస్థలం. మాది వ్యవసాయ కుటుంబం. వారి సంతానంలో నేను రెండవ వాన్ని. అన్నయ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్టుమెంట్ హెడ్ గానూ, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గానూ పనిచేసి వున్నారు. నాకిరువురు చెల్లెళ్లు. ఒకరు న్యాయవాదిగా, మరొకరు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగంలో వున్నారు. 
నా విద్యాభ్యాసం పూర్తిగా నల్లగొండలోనే జరిగింది. నాకు చిన్నప్పటినుంచి పుస్తక పఠనం పిచ్చి. కనిపించిన ఏ పుస్తకాన్ని, పేపరును చదవకుండా వదిలేవాని కాను. ఈ అలవాటు మా అమ్మ ద్వారా కలిగిందని గట్టిగా నమ్ముతాను. అమ్మ చదువుకున్నది మూడవ తరగతి. అయినా కనిపించిన వారపత్రికలలో, మాస పత్రికలలో అన్ని కథలు చదివి అర్ధం చేసుకునేది. నల్లగొండ లైబ్రరీలో నుండి తన కిష్టమయిన "కాశీ మజిలీ కథలు" నా ద్వారానే తెప్పించుకునేది. తరచుగా లైబ్రరీ వెళ్లడం వల్ల ఆ అభ్యాసం నాకూ సంక్రమించింది. ఆరోజుల్లో అందులో ఉన్న  పుస్తకాలలో దాదాపుగా అన్నీ నేను చదివినవే. ఎక్కువగా కవిత్వం పుస్తకాలను చదవడం వల్లనేమో నాకు కవిత్వం పై మక్కువ ఎక్కువగానే ఉండేది(ఇప్పటికి కూడా). అంపశయ్య  నవల రాసిన శ్రీ డి. మల్లయ్య (నవీన్) గారు ఆరోజుల్లో మా ఇంట్లోనే అద్దెకుండేవారు. ఆ నవల మా ఇంటిలో ఉన్నప్పుడే వారు పూర్తిచేసి విడుదల చేసినారు. మా నాన్నగారికి ఆ నవల అందిన మరుసటి రోజే అది పూర్తిగా చదివేశాను. అప్పుడు నేను ఇంకా పాఠశాల విద్యార్థినే. నాపై సినారె గారి కవిత్వ ప్రభావం బాగానే వుంది. కాలేజీలో చదువుతున్నపుడే కొన్ని కవితలు రాసి ఎవరికీ చూపించకుండా దాచుకునేవాడిని. అవి నాన్న కళ్ళల్లో పడడంతో వారి మిత్రులకు నన్ను ఓ కవిగా పరిచయం చేస్తుండేవారు. నాన్నగారు కొంతకాలం తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం ద్వారా ఎన్నికై MLC గా 1969-71 ప్రాంతంలో పనిచేసినారు.
నా డిగ్రీ చదువు పూర్తికాగానే నల్లగొండ రెవెన్యూ డిపార్టుమెంటులో ఉద్యోగం రావడంతో నాకిష్టమయిన ఉన్నత చదువుల ప్రస్థానానికి బ్రేక్ పడింది. కొంత కాలం తహశీలు కార్యాలయంలో పని చేసినన్ను. పై చదువులు ఆగిపోయాయనే బాధ నన్ను బాగా కలచివేసేది.  పెళ్లి తరువాత హైదరాబాదు నగరానికి వచ్చి సివిల్ సప్లయిస్ డిపార్టుమెంట్లోకి మారి ఉద్యోగం చేస్తూనే మళ్లీ చదువును కొనసాగించే ప్రయత్నం చేసాను. కానీ అది కుదరకపోవడంతో ఉద్యోగంపైనే పూర్తిగా దృష్టి సారించాను. 

నా శ్రీమతి పేరు ఇందిర. తను పోచంపల్లి భూదాన్ రామచంద్రారెడ్డి గారి మేనల్లుని కుమార్తె. మాకిద్దరు కుమారులు. ఇద్దరూ Information Technology లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆస్ట్రేలియాలో స్థిరపడినారు. నేను 2011లో ఉద్యోగము నుండి రిటైర్ అయి హైదరాబాదులోనే ఉంటున్నాను. ప్రస్తుతం నాకు మా ఆవిడ, ఆవిడకు నేను తోడూనీడ. 


ఇక నా కవన జీవితంలోకి వస్తే రిటైర్మెంట్ తరువాత నా కవిత్వానికి మళ్లీ జీవంపోసుకున్నాను. ఫేస్ బుక్ సామాజిక మాధ్యమం ద్వారా కవి యాకూబ్ గారు పరిచయం కావడం వారి ద్వారా "కవి సంగమం" గ్రూపులో చేరి నా కవిత్వాన్ని పలువురితో పంచుకోవడం జరిగింది. కవి సంగమ ప్రస్థానం ఎంతో మంది ప్రముఖులతో పరిచయ భాగ్యాన్ని ప్రసాదించింది. మరెన్నో కవిత్వ సమూహాల ద్వారా నా రచనల్ని విస్తృత పరచుకున్నా. అయితే నా రచనలు చాలా వరకు అంతర్జాలంలోనే ప్రచురణకు నోచుకున్నాయి. నా కవిత కవి యాకూబ్ గారి వల్ల కవి సంగమ గ్రూప్ వారి సంకలనంలో తొలి సారిగా ముద్రణకు నోచుకుంది. నేను రాసిన రచనలు ఇంకా అముద్రితాలే. నేను రాసిన వాటిలో ఏక వాక్య కవితలు, ద్విపాద కవితలు, నానోలు, రూబాయీలు, గజళ్ళున్నాయి. కొన్ని గజళ్ళు ప్రముఖ గజల్ గాయని శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళా గారు ప్రచురించిన "గజల్ సుమాలు" సంకలనంలో ప్రచురణకు నోచుకున్నవి. 

ఇవే కాక రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ సమాఖ్యలో సంయుక్త అధ్యక్షునిగా, హైదరాబాదు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో సెక్రెటరీగా, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘంలో  బాధ్యునిగా, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షునిగా సామాజిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ ఉంటాను. 

ఇవీ నా పరిచయ వాక్యాలు.
*****


మీ ఇగోల పీచమణచాలి ఎలా?

నువ్వు సోదరుడివి అయినా, తండ్రి అయినా, మామ అయినా ,కొడుకు అయినా , మొగుడివి అయినా నీకు సేవ చేసే సమయానికి ఆడది తల్లిలా మారుతుంది. కాని నువ్వు మ(మృ)గాడిలా, నీకు సేవ చేస్తున్న వాళ్ళని కేవలం ఆడదానిలాగో, ఒక పనిమనిషిలాగో చులకన చేస్తుంటే... డామిట్ ! వృద్ధాశ్రమాలు పెరగడం, వృద్ధలమీద గౌరవం తగ్గడం ఇందుకే...వృద్ధులని గౌరవించండి, వారిని ప్రేమించండి, అంటూ నీతి వాక్యాలు వారి పెద్దరికం నిలబెట్టుకునే వృద్ధులకే కానీ, కార్యేషు దాసీ, అంటూ పురాణ నీతులు వల్లే వేస్తూ, పంగతీసుకుని పడుకుని చేయించుకునే ఇగోల మగ వృద్ధులకి కాదు....

ఆడవాళ్ళని వారి ఆలోచనా స్థాయిని కనీసం .౦౦౦1% అన్నా అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి 


11.14.2017

వనభోజనం- మనభోజనం 3. సాధనాల వెంకటస్వామి నాయుడు గారు

పేరు ప్రఖ్యాతలు దండిగా గల సాధనాలగారు పిలవగానే నేను వస్తున్నాను అని చెప్పి మాట తప్పకుండా వనభోజనాలకి  వచ్చి "అమ్మ " పై చక్కని గీతాన్ని ఆలపించి అందరిని అలరించారు. ధన్యవాదాలు సాధనాల గారు... 

సాధనాలగారి గురించి "అమ్మో సాధనలగారు" అనుకునేలా వివరంగా...... ఆయన మటుకు
నిరాడంబరంగా.. హుందాగా ఉంటారు.. ఇంతటి ఘనులు అని మనకి తెలియదు. మీరే చదవండి. 



సాదనాల వేంకటస్వామి నాయుడు సాహిత్య, సంగీత, నాటక, సాంస్కృతిక, సేవా రంగాలలో కృషి చేస్తున్న కళాపిపాసి.
సాదనాల వేంకటస్వామి నాయుడు (Sadanala Venkata Swamy Naidu) 1961, ఫిబ్రవరి 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, గేదెల్లంక గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించారు. వీరు సికిందరాబాదు డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.



వీరు కథలు, కవితలు, వ్యాసాలు, గేయాలు, నాటికలు అనేకం వ్రాశారు. సాధనాల గారి  రచనలు సమాచారం, కళాప్రభ, నేటి నిజం, అపురూప, అంజలి, రచన,ఎక్స్‌రే,ఆంధ్రజ్యోతి మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కథలు, కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. అతను  రచించిన గీతాలు కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆకాశవాణిలో సాధనాల గారు  వ్రాసిన గీతాలు, సంగీతరూపకాలు, నాటికలు ప్రసారమయ్యాయి. సాధనాల గారి రచనలకు ఎన్నో బహుమతులు లభించాయి. అలాగే అతని రచనలు ఇంగ్లీషు, హిందీ, ఒరియా భాషలలోకి కూడా  తర్జుమా అయ్యాయి. పలు సాహిత్య సంస్థలతో సాధనాలగారికి సంబంధాలున్నాయి. అనేక సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ గావించారు.

ముద్రిత రచనలు 

దృశ్యం (వచన కవితాసంపుటి)
కృష్ణాపత్రిక సాహిత్య సేవ - ఒక పరిశీలన (సిద్ధాంత గ్రంథం)
నాయుడు బావ పాటలు
సర్వసమ్మత ప్రార్థన

అముద్రిత రచనలు 
తెలుగు వచన కవులు (1930-1990)
అక్షర తమాషాలు
ఆడియో కేసెట్లు 
పుష్కర గోదావరి
కట్టెమిగిల్చిన కన్నీటి గాథ
అక్షరదీపం
సుముహూర్తం
మహనీయుల స్ఫూర్తితో
తెలుగుతేజం
విజయకెరటం

సాహితీ సంస్థలలో సాధనాల గారి పాత్ర 

ది పొయెట్రీ సొసైటీ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) - సభ్యుడు
కవిత్వం (రాజమండ్రి) - కార్యదర్శి
వాగర్ధ సమాఖ్య (రాజమండ్రి) - సభ్యుడు
సాహితీ సమితి (ఖమ్మం జిల్లా) - ఉపాధ్యక్షుడు
ఇండియన్ హైకూ క్లబ్ (అనకాపల్లి) - ప్రాంతీయ కార్యదర్శి
వాగనుశాసన వాజ్మయవేదిక - కార్యదర్శి
సాహితీవేదిక - కోశాధికారి
జీవనసాహితి - ముఖ్యసలహాదారు

ఆకాశవాణిలో ఆడిషన్ పాసై గాయకుడిగా అనేక జానపద గేయాలు పాడారు. డ్రామా ఆడిషన్ పాసై బి గ్రేడ్ కళాకారుడిగా పాతికకు పైగా రేడియో నాటకాలలో నటించారు. విజయశంకర్ ప్రభుత్వ సంగీత,నృత్య కళాశాల రాజమండ్రిలో మృదంగం, గాత్రం అభ్యసించాడు. మూషిక మరణం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశారు . అనేక నాటకాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేసి స్వయంగా నటించారు. పల్లెరథం, సంధ్యారాగం, సువ్వీ సువ్వన్నలాలి, గోదావరి చెప్పిన సుబ్బారావు కథ, అదిగో భద్రాద్రి మొదలైన సంగీత రూపకాలను వ్రాసి ఆకాశవాణిలో ప్రసారం కావించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన గురజాడ దిద్దుబాటు, కథావీధి టెలీ ఫిల్ములలో నటించాడు. 2011 నంది పద్యనాటక పోటీలకు స్కృటినీ జడ్జిగా పనిచేశారు.


పురస్కారాలు: 2012 ఫిబ్రవరిలో గుంటూరులో జరిగిన నంది నాటక ప్రదానోత్సవ సభలో బంగారు నంది ప్రదానం , 
రాష్ట్రస్థాయి ఉత్తమ కవితాసంపుటిగా దృశ్యం పుస్తకానికి తడకమట్ల సాహితీ పురస్కారం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా సత్కారం
జేసీస్ క్లబ్ ఔట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డ్
రోటరీ లిటరరీ అవార్డ్
దక్కన్ యువకవితోత్సవ్‌లో ఉత్తమ కవితా పురస్కారం
బూర్గుల రామకృష్ణారావు స్మారక రాష్ట్రస్థాయి కవితలపోటీలో ప్రథమ బహుమతి
సమతా రచయితల సంఘం, అమలాపురం వారి సాహిత్య పురస్కారం
యు.టి.ఎఫ్. ఖమ్మం జిల్లా శాఖ నిర్వహించిన గేయరచనల పోటీలో ప్రథమ బహుమతి
లయన్స్ క్లబ్ తెనాలి నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి
సిలికానాంధ్ర, రచన పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన గేయరచన పోటీలో బహుమతి
ఎక్స్‌రే,మానస, కళాదర్బార్ మొదలైన సాహిత్యసంస్థలు నిర్వహించిన కవితలపోటీలలో బహుమతులు.. 
*****


వనభోజనం - మన భోజనం 2. ఆనంద్ మోహన్ ఓరుగంటి గారు



తమ తమ  రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరుప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగు వారిలో ముఖ్యులు శ్రీ ఆనంద్ మోహన్ వోరుగంటి గారు. 


ఆయన ఎదుర్కున్నప్రతిబంధకాలు, సంక్లిష్టపరిస్థితులు, అనుభవించిననిర్భందాలు, పడినఆవేదన, చేపట్టినదీక్ష, చేసినకృషి, సాధన, కనపరచినపరకాష్ట, సాధించినవిజయాలు, ఆ విజయరహస్యాలు ఆటుపోట్ల అనుభవం నుండి ఎంతో విశ్లేషణా శక్తి పెంపొందించుకున్నారు. అవగాహన కూడా బాగా దృఢపడింది. లోతైన ఆలోచనలతో క్షీర సాగర మదనంలా సంగీత సాగర మదనం చేయసాగారు. రాగ భావంలో ఉన్న నిగూఢ నిక్షిప్తార్ధలను ఆకళించుకున్నారు. వీరి సంగీత నైపుణ్యం తారా స్థాయికి ...చేరుకొని ఏర్పడ్డదే సంగీత క్షీర సాగరం. "సంగీత క్షీర సాగరం"  నిర్వహణలో త్యాగరాజ గాన సభలో ఎన్నో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. 

వన భోజనాల కార్యక్రమం ఉంది అనగానే  "ఎక్కడ" అని తానె అడిగి వచ్చి అద్భుతమయిన్న తన గాత్రాన్ని మనకి వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఉన్నది కొంచం సేపే అయినా మర్చిపోలేని అనుభూతిని ఇచ్చి, అందరినీ ఆశీర్వదించారు బాబాయ్ గారు శ్రీ ఆనంద్ మోహన్ ఓరుగంటి గారు. 




11.13.2017

మన వనభోజనాల్లో ప్రముఖులు -1 గంగాధర్ తిలక్ కట్నం గారు

గంగాధర్ తిలక్ కట్నం గారు 

అక్టోబర్ 27 న ప్రియనేస్తం ఎన్నారై గీతా గడ్డం ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ లో కలిసినప్పుడు "సర్ వనభోజనాలకి రావాలి"  అని చెప్పడం జరిగింది. "తప్పకుండా నా గర్ల్ ఫ్రెండ్ తో వస్తాను "  అని చెప్పి ఇచ్చిన మాట తప్పకుండా, వచ్చారు ఊరికేనే రాలేదు డాక్టర్ ఆఫ్ రోడ్స్ లా మనముందుకు వచ్చి ఇందిరాపార్క్ గెట్ ముందు ఉన్న గుంతకీ వైద్యం చేసి గుంతని పూడ్చేశారు. అలా ఈ సంవత్సరం ఫేస్ బుక్ స్నేహితుల వనభోజనాలకి ఒక అపూర్వ ఖ్యాతిని తీసుకొచ్చారు శ్రీ గంగాధర్ తిలక్ కట్నం గారు. 




రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర‌యిన గంగాధ‌ర్ తిల‌క్ హైద‌రాబాద్ రోడ్ల కోసం ప‌డుతున్న తాపత్ర‌యం చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. త‌న‌కు తెలిసిన మేర‌లో రోడ్ల‌పై ఎక్క‌డ గుంత క‌న‌ప‌డినా తిల‌క్ ఆ గుంత‌ను స్వ‌యంగా పూడుస్తారు. ప్ర‌తిరోజూ ఆయ‌న తారు మిశ్ర‌మాన్ని 8 నుంచి 10 బ్యాగుల్లో నింపుకుని రోడ్డుమీద‌కు వ‌స్తారు. ఎక్క‌డ గుంత క‌న‌ప‌డినా దాన్ని వెంట‌నే పూడ్చివేస్తారు. ఆయ‌న ఇలా చేయ‌టానికి ఓ కార‌ణం ఉంది.

ఒక‌రోజు తిల‌క్ త‌న కారులో వెళ్తుండ‌గా గుంత‌లో టైర్ దిగి వెంట‌నే ఆ నీరు ప‌క్క‌నే ఉన్న వీధి బాల‌ల‌పై ప‌డింది. అది చూసిన తిల‌క్ కు చాలా బాధ క‌లిగింది. వెంట‌నే త‌న జేబులోనుంచి రూ5వేలు తీసి అక్క‌డ ఉన్న గుంత‌ను పూడ్పించారు తిల‌క్‌. అప్ప‌టినుంచి ఆయ‌న ఇలా గుంత‌ల‌ను పూడ్చే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.  స‌మాజం ప‌ట్ల తిల‌క్ క‌న‌బ‌రుస్తున్న అంకిత భావానికి మ‌నంద‌రం సెల్యూట్ చేద్దాం. రోడ్ల‌పై గుంత‌ల మూలంగా హైద‌రాబాద్ వాసులు ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. అయినా అంద‌రూ ప్ర‌భుత్వాన్ని తిట్టుకునే వాళ్లే కానీ ఇలా రోడ్ల‌ను బాగుచేసేందుకు ఒక్క‌రూ ముందుకురారు. కానీ తిల‌క్ స్వ‌యంగా గుంత‌లు పూడ్చే బాధ్య‌త తీసుకుని అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.




అలాగే వనభోజనాల కార్యక్రమంలో తానూ చేసిన పని అందరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని కేవలం గుంటలు పూడ్చడమే కాదు సమాజానికి ఉపయోగపడే ఎదో ఒక పనిని అందరం కలిసి చేద్దాం అని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలకి విన్నవించుకుని అధికారులు స్పందించి చేసే సమయంలో మనం మనపని అనుకుని అందరూ స్వచ్చందంగా ముందుకు వస్తే, ఎన్నో సమస్యలని పరిష్కరించుకోవచ్చని పిలుపునిచ్చారు. అందరితో కలిసిపోయి ఆడుతూ, పాడుతూ సామాజిక సేవ చేస్తున్న గంగాధర్ తిలక్ కట్నంగారు మీకిదే మా బిగ్ సెల్యూట్. 

వనభోజనం- మనభోజనం ఓ విశ్లేషణ

మా ఇంటికి స్కూల్ పక్కనే ఉండడంతో  మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళం. కాని ఆ వయసులో నాకు అలా ఫ్రెండ్స్ అందరూ మధ్యాహ్నం బాక్స్ లు తెరిచి తింటుంటే మా అమ్మ కూడా అలా బాక్స్ కట్టిస్తే బాగుండును అనిపించేది. అదే అమ్మతో అంటే "ఎందుకూ ఇంటికొచ్చి వేడి వేడి అన్నం తినక వెధవ్వేషాలు వేయకు... అయినా పొద్దున్నే పూజ అవి ఏమి లేకుండా నేను వంట చేయను " అని ఖరాఖండిగా చెప్పేసింది. ఒక్క నవంబర్ నెలలో మటుకు కాస్త పులిహోర చేసి గుళ్ళో ఉసిరి చెట్టుకింద కూర్చుని తినమని పంపేది. అర్థం అయ్యేది కాదు ఎందుకలా నవంబర్ నెలలోనే గుడిదగ్గర తినడం .. అనిపించి ఒక్కోసారి ఫ్రెండ్స్ తో కూర్చుని స్కూల్ దగ్గర తాటి చెట్టుకింద కూర్చుని తినేదాన్ని. ఆ బాక్స్ ఇచ్చినప్పుడు మటుకు ఎప్పుడు లంచ్ బెల్ అవుతుందా ఎప్పడు చెట్టు కింద కూర్చుని తిందామా అని ఎదురు చూసేదాన్ని.  మళ్ళీ సంవత్సరం దాకా ఆ అవకాశం రాదు కదా.. ఇదొక బాల్య జ్ఞాపకం. 
*****
స్కూల్ జీవితం అయి కాలేజ్ జీవితాలు మొదలయ్యేప్పుడు ఇక అమ్మ రోజు బాక్స్  కట్టి ఇవ్వడం ఫ్రెండ్స్ అందరం తలాకాస్తా  పంచుకుని సరదాగా తినేవాళ్ళం. ఈ  ఉప్పోద్ఘాతం ఇప్పుడు ఎందుకు అంటే వనభోజానాలు నాకు చాలా ఇష్టం ఎక్కడెక్కడివాళ్ళమో వాళ్ళు   బంధువులయినా కావచ్చు, స్నేహితులయినా కావచ్చు, సహోద్యోగులయినా కావచ్చు అందరం కలిసి వనంలో భోజనం చేయడం. యాంత్రిక జీవితం నుండి బయటకి వచ్చి ఆహ్లాదంగా గడపడం. 

సరే, కార్తీకమాసం, దీపాలు, దీపదానం,              కార్తీక పురాణం , పుణ్యం లాంటివి స్నేహితులతో పాటించడం కష్టమే.. గత 3 సంవత్సారాలుగా కార్తిక మాసంలో ఫేస్  బుక్ స్నేహితులతో వనభోజనాలు మిత్రుల    సహాయ సహకారాలతో నిర్వహిస్తూ ఉండేదాన్ని. కిందటి సంవత్సరం బ్రేక్ చేయలేదు .... కారణాలు   గుర్తు లేదు.... ఈ సారి                  ఫేస్ బుక్ స్నేహితురాలు గీతా గడ్డం ని కలవడానికి వెళ్ళినప్పుడు  కలిసిన కొత్త మిత్రులు  లాయర్ అరవింద కృతిక, జర్నలిస్ట్ శ్రీ శౌరి  కుమార్ గారు... మాటల సందర్భంలో వీరు వనభోజానాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని అడిగినప్పుడే  ఈ సారి వనభోజనాలకి  శ్రీకారం  చుట్టేసాం. అలా కిందటి నెల 27                    న  రూపు దాల్చిన ఆలోచన      నిన్న ఆదివారం ప్రాణం పోసుకుని పెద్దల ఆశీర్వాదంతో                విజయవంతం అయింది. 

నాదొకటే ఆలోచన వనభోజనాలు కుల భోజనాలు  కాదు. అందరం కలిసి ఉండడమే దీని వెనక ఆంతర్యం , రెండోది సామాజిక   మాధ్యమాల్లో ఉండే స్త్రీ ల గురించి ఏంతో మంది మేధావులు ఎన్నోసార్లు నాముందే   అనే మాటలు మనసుని కలిచి వేస్తాయి. వాళ్ళు పని పాట లేక ఫేస్ బుక్లో ఉంటారని, ముఖ్యంగా  చీప్ ఆలోచనలు, వాళ్ళకి క్యారెక్టర్ ఉండదని, లేదా ప్రేమిస్తున్నామని చెప్తే ఎగేసుకుని వచ్చేస్తారనే భ్రమలో ఏంతో మంది ఉన్నరు. ఫేస్ బుక్ అనే కాదు , ఏ సామాజిక మాధ్యమాల్ల్లో చురుకుగా ఉన్న స్త్రీలకి వ్యక్తిత్వం ఉంటుంది . వాళ్ళు ఎటు కీ ఇస్తే అటు ఆడే బొమ్మలు కాదు. వాళ్ళ ఆలోచనలకో , వాళ్ళ స్థాయికో ఏదిగి వారి వ్యక్తిత్వాన్ని గౌరవించండి. అని తెలపడానికి,  హితులందరూ మంచి మనసుతో కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు.ఫేస్ బుక్ స్నేహితులు అందరూ  ఫేక్ స్నేహితులు కారు వారిలోని స్వచ్చమయిన కల్మషం లేని మనుషులు ఉంటారు. అన్న నిరుపణే ఈ వనభోజనాల కార్యక్రమాలు. ఈసారి అందరూ వచ్చారు. ఫేస్ బుక్  లో నేను అడ్మిన్ గా  ఉన్న  నవ్వుల కుటుంబం నుండి కూడా         పలువురు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసారు.కుల మతాలకి అతీతంగా ఫేస్ బుక్  రూమర్లకి చెక్ పెట్టె విధంగా , ఏంతో మంది   ప్రముఖుల సమక్షంలో హుందాగా జరిగాయి             ఇందిరాపార్క్ లో  వనభోజనాలు ఆనందంగా.......

హాజరయిన ప్రముఖుల గురించి తరువాత పోస్ట్.లో 

వనభోజనాల ఫోటోలో అన్ని ఒక పోస్ట్ లో  మీకోసం 






11.12.2017

వనభోజనం- మన భోజనం

నిన్న ఆదివారం ఇందిరా పార్క్ లో .... ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ

వనభోజనం - మన భోజనం

తల్లి తోడూ, పిల్ల మేక, ఆలుమగలు, అత్తాకోడలు, బాసు బంటు ఒకటేనంటూ కలవడం భోజనం వనభోజనం..
వనభోజనం జనరంజనం

ఇదండీ అసలు ఫోటో అంటే..నిన్న ఇందిరాపార్క్ లో ఫేస్ బుక్ మిత్రుల వనభోజనాల హల్ చల్

వనభోజనం - మన భోజనం -1


గంగాధర్ తిలక్ కట్నం గారు, (డాక్టర్ అఫ్ రోడ్స్) వనభోజనాలకి ముందు ఇందిరాపార్క్ ముందు ఉన్న గుంతని పూడుస్తూ..... ఈ వనభోజనాలకి చారిత్రాత్మక గుర్తింపు తీసుకొచ్చారు. ఈ శ్రమదానానానికి గుర్గాన్ నుండి మీడియా ప్రముఖులు వచ్చి కవర్ చేయడం జరిగింది. వీరందరూ వనభోజనాలలో పాల్గొనడం మరో విశేషం. ఆ తరువాత మన గ్రూప్ అందరిని ఫోటోలు, వీడియో తీయడం ప్రత్యేకం. (తిలక్ గారు ఫొటోస్, వీడియో కోసం వెయిటింగ్) 
ఇందిరా పార్క్ వద్ద ఉన్న గుంతని పూడ్చిన సందర్భంలో తీసిన ఫోటో ఇది




లేఖా సాహిత్యం -2

"నీకు ఎన్నో చెప్పాలనుకుంటాను అమ్మలూ కాని మీ హడావిడి జీవితాలకి తీరికగా మా ముందు కూర్చుని వినే ఓపిక తీరిక మీకు లేవని నాకు తెలుసు. సరే కూర్చున్నారు కదా అని చెప్పాలి అనుకుంటే ఎందుకమ్మా బి సి నాటి మాటలు అంటావు. నీకు ఎలా చెప్పాలో అర్థం కాక, ఏ విధంగా చెప్తే నీ దగ్గరికి నా మాటలు చేరుతాయో తెలియక సతమతం అవుతున్నాను.
ఏమి తెలియని బాల్యాన్ని, తెలిసి తెలియని యవ్వన ప్రయాణాన్ని , తెలుకుందామన్న అవగాహన రాని వివాహ బంధం , తెలిసిన తరువాత వచ్చిపడిన పెద్దరికం, వెరసి మీ అమ్మ. ఈ పని నేనే ఎందుకు చేయాలి అనే పెంకితనం, బెట్టు నుండి , ఇది నేను మాత్రమె చేయగలను వీళ్ళంతా నామీద పూర్తిగా ఆధారపడినవారు అన్న విషయం తెలిసే సరికి జీవితం సగబాగం గడిచిపోయింది. ఇంక ఎంత మిగిలి ఉందొ కాని.. పిల్లలికి ఏమి చెప్పకుండా నాలాగే పెరిగితే ఇప్పటి సమాజం వాళ్ళని అమాయకులని చేసుకుని ఆడుకుంటుంది అన్న భయం ఉంది.


భయం ... అనుక్షణం భయంతోనే జీవితాన్ని గడుపుతారు తల్లి తండ్రి తెలుసా అమ్మలు.. మొన్న అర్థరాత్రి పని ఉంది హాల్ లోకి వస్తే నువ్వు సెల్ లో చాటింగ్ చేస్తున్నావు... చూస్తె ఏముంది వాట్స్ అప్ కి లాక్, ఫేస్ బుక్ లాక్, ఫోన్ కూడా లాక్... అయినా నీమీద కొండంత నమ్మకం.. ఏంటి అమ్మలూ ఇది అని నిలదీసి అడిగితే ఆ ఒక్కరోజుకి నా మాట వింటావు.. తరువాత యదా ప్రకారం సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటావు. పిల్లలిని నమ్మడం విషయంలో అమ్మా , నాన్నా అమాయకులే అమ్మలు.. వారి జ్ఞానం ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది. చెప్తే వినలేరు , చెప్పలేము, పోనీ దెబ్బలు వేద్దామన్నా చెట్టంత పిల్లలు.... మార్పు రావాలమ్మా ,జీవితం , జీవనం సెల్ తోనే ఉంది అన్న భ్రమ నుండి బయటకి వస్తే ఏంతో అందమయిన ప్రపంచం కనిపిస్తుంది. ఆ అందమయిన ప్రపంచంలోకి అడుగిడినపుడు నువ్వే అంటావు ఇవన్నీ నాకెప్పుడు కనపడలేదు అమ్మా అని..
నీలో /మీలో మార్పు కోరుకునే 
మీ అమ్మ..

లేఖాసాహిత్యం -1



అమ్మలూ
ఎలా ఉన్నావురా? కొత్త ఊరు, కొత్త ఇల్లు, అందరూ కొత్తవాళ్ళు, అమ్మా, నాన్న తమ్ముడూ ఈ వాతావరణం నుండి, అత్తా.. మామ, భర్తా, మరిది, ఆడపడుచూ అందరూ కొత్తవాళ్ళే , కొత్తదనం, కొత్తప్రపంచం. కాని అదే మన ప్రపంచం నాన్నా.... నువ్వు అత్తారింటికి వెళ్లావు అనే కాని, ఎందుకో గులాబి రంగు గౌనులో నెమ్మదిగా ఒద్దికగా ఎక్కడ పడిపోతానో అన్నంత జాగ్రత్తగా పునాది వేస్తున్న ఆ మట్టిగుట్టని దాటుతున్న నా చిన్నారి కూతురే నా కళ్ళముందు తిరగాడుతున్నట్లు ఉంది. ఇంతలో ఎంత మార్పు. ఆడవాళ్ళం అత్తగారింట్లో ఇలా ఉండు, అలా ఉండు, అనే జాగ్రత్తలు నేను చెప్పక్కర్లేదురా.. పరిస్థితులు, అక్కడి స్థితిగతులు మనం ఎలా నడుచుకోవాలో మనకి నేర్పేస్తాయి. అత్తగారిల్లనే కాదు ఎవరయినా మన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ మన ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడకుండా ఉంటె అందరూ మనవాళ్ళే. మనసు మాట విను. మమతలతో మనిషిని జయించు, ప్రేమతో మనసుని సొంతం చేసుకో.... మనకి ఎన్ని సాంకేతిక సౌకర్యాలు వచ్చినా మనం సొంతంగా తయారు చేసుకుని ప్రేమగా పిల్లలితో, మనవాళ్ళతో, పంచుకునే అనుభూతులే ఎప్పటికి నిలిచేవి. అధూనికత అలసట తీర్చడానికే గాని సోమరితనం పెంచడానికి కాదు. 
ఉంటాను అమ్మలు... వీలయినప్పుడల్లా నీతో ఇలా నా అనుభూతులని పంచుకుంటూ ఉంటా....

ప్రేమతో 
మీ 
అమ్మ. 
**********

కూతురికి పెళ్ళయితే తల్లి తన అనుభవసారాన్ని , అక్షరరూపంలో లేఖగా మార్చి తెలిపే ప్రయత్నం ఈ లేఖా సాహిత్యం... ప్రతీ కూతురికి ఉపయోగపడుతుంది అన్న ఆశతో...

4.08.2017

Hair the pride of women - a touching video

ఓ వాలుజడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా
రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా ఇపుడెందుకే ఈ రగడా

నాగరం ధరియించిన
నాగుబామొక్కటి
నవ్వుచూ నిలుచుండి చూస్తున్నయట్లు
నల్లని వాలుజడ అనిపించ
పెళ్ళిచూపులకొచ్చిన పెళ్ళికొడుకు
పిల్ల వెళుతుండగా అందమైన జడను
పరవశముతో గాంచుచూ
పెళ్ళికి వెంటనే ఒప్పుకొనగ 


ఇలా జడ గురించి ఎన్నెన్ని వర్ణనలు, కను ముక్కు తీరు బాగున్నా జడ ఎలా ఉంది అని చూసేవాళ్ళు పూర్వపు రోజులలో.... జడతో కొట్టక మానను అనే మాట మరువగలమా... జడను గురుంచి ఎన్నెన్ని కావ్యాలు , రాసికప్రియుల మన్మధ బాణం జడ అంటారు సాహితీ ప్రియులు. అలాంటి జడ, జుట్టు పొడుగు ఉన్న ఓ అమ్మాయి ఓ బ్యూటీ పార్లేల్ కి వెళ్తుంది ఆమె జుట్టు చూసి ఆ బ్యూటీ పార్లేల్ అమ్మాయిలు ముచ్చట పడి పోతారు చివర కట్ చేస్తే చాలా అని అడుగుతారు. ఉహు ఇంకొంచం , ఇంకోచం అంటూ వాళ్ళు ఆ జుట్టు ని బాబ్డ్ హెయిర్ చేసేదాక వదలలేదు మనసు రాకపోయినా కస్టమర్  సాతిస్ఫక్షన్ బుసినెస్ ధర్మం కాబట్టి తప్పక ఆమె చెప్పినట్లు చేసారు. ఆమె కన్నీటితో తన జుట్టుని తడుముకుంది. కింద పది ఉన్న పొడవాటి జుట్టు ఆనవాళ్ళని చూసి బాధపడుతుంది. మళ్ళీ ఒకసారి జుట్టు కట్ చేసిన ఆమె వైపు చూసి పిడికిలో జుట్టు పట్టుకుని కన్నీటితో అంటుంది కనీసం ఇలా పిడికిలికి కూడా రాకుండా జుట్టు కట్ చేయగలవా అని అడుగుతుంది . ఎంత ఆర్థ్రం అందులో ఎంత అర్థం నిగూఢమయి ఉంది. జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టే పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నామని, జుట్టే మన గర్వకారణం అని మురిసిపోతున్నాము కాని అదే మనపాలిత శత్రువు అవుతోంది అని తెలియజెప్పే ఒక అద్భుతమయిన వాణిజ్య ప్రకటన. మనసుని కలిచివేయకమానాడు ఈ ప్రకటన మీరు చూడండి. కంటనీరు తెప్పించే ఈ స్లోగన్ కూడా hair the pride of women ....అవును బానిసగా బతకడానికి ఒకరి పిడికిలో మిగలడానికి ఉపయోగపడ్తున్న జుట్టు అది... టచింగ్ వీడియో

Loading...